సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) పెద్దకొడుకు రమేశ్ బాబు (Ramesh Babu) ఇవాళ మన మధ్య లేరు. కృష్ణ నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రమేశ్ బాబు… ఆ తర్వాత నిర్మాతగా మారిపోయారు. తన తమ్ముడు మహేశ్ బాబు (Mahesh Babu) తో సినిమాలు తీశారు. రమేశ్ బాబు మరణానంతరం ఆయన కొడుకు జయకృష్ణ (Jaya Krishna) నటనపై మక్కువ పెంచుకున్నాడు. తాతయ్య, తండ్రి, బాబాయ్ మాదిరిగా తానూ నటుడు కావాలని అనుకున్నారు. అందుకే విదేశాలలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు జయకృష్ణతో సినిమాలు నిర్మించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అయితే… ఈ విషయంలో మాత్రం ఘట్టమనేని ఫ్యామిలీ ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఎందుకంటే నందమూరి (Nandamuri), అక్కినేని (Akkineni), రామానాయుడు (Ramanaidu) , కొణిదెల (Konidela), అల్లు (Allu) కుటుంబాల మాదిరిగానే ఘట్టమనేని వంశంలోనూ చాలామంది నటీనటులు ఉన్నారు. కృష్ణ కుమార్తె మంజులతో పాటు ఆమె భర్త సంజయ్ స్వరూప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. మహేశ్ బాబు తరహాలోనే అతని చిన్న బావమరిది సుధీర్ బాబు హీరోగా కొనసాగుతున్నాడు. ఇక మహేశ్ పెద్దక్క పద్మావతి కొడుకు గల్లా అశోక్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మరో రెండేళ్ళు పోతే మహేశ్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం.
