కావలసినవి :
మామిడికాయ గుజ్జు – కేజీ, ఉప్పు – పావు కేజీ, పసుపు – టేబుల్ స్పూను, కారం – 125 గ్రా, అల్లం వెల్లుల్లి ముద్ద – పావు కేజీ, నువ్వుల నూనె – పావు కేజీ, జీలకర్ర పొడి – 2 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి – టేబుల్ స్పూను, ఇంగువ – టీ స్పూను, ఆవాలు, జీలకర్ర, మెంతులు – ఒకటిన్నర టీ స్పూన్లు.
తయారీ :
బాగా కండ ఉన్న మామిడికాయలు తీసుకుని కడిగి తుడిచి తగినంత నీళ్లు జతచేసి కుకర్లో ఉడికించాలి. చల్లారిన తర్వాత పై చెక్కు తీసి చెంచాతో లోపలి గుజ్జుంతా తీసి పెట్టుకోవాలి. ఈ గుజ్జు కొలతతోనే మిగతా దినుసులన్నీ కలుపుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నువ్వులనూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఇంగువ వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎరబ్రడ్డాక దింపేయాలి. నూనె చల్లారి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమం, మామిడిగుజ్జు వేసి బాగా కలియ బెట్టాలి. శుభ్రమైన జాడీలోకి తీసి పెట్టుకోవాలి. మూడు రోజుల తర్వాత మళ్లీ కలపాలి. ఈ ఆవకాయను అన్నంలోకే కాకుండా, చట్నీలా ఇడ్లీ, దోసె, ఉప్మాలకు కూడా వాడుకోవచ్చు.
